కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) పట్టణంలో వాణిజ్య కేంద్రంగా ప్రకాశం బజార్ (Prakasham Bazar)కు దశాబ్దాల కాలంగా పేరుంది. అక్కడ బడా వ్యాపారులతో పాటు రోడ్ల వెంట చిరు వ్యాపారులు వందల సంఖ్యలో తోపుడు బండ్లు, డివైడర్ మధ్యలో పండ్లు, పూలు, కుండలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిజానికి వాళ్లంతా చిరు వ్యాపారులు. పొద్దంతా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి చిరువ్యాపారులపై పెద్ద ప్రతాపమే ప్రదర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) సమక్షంలో అధికారులు తెల్లవారేసరికి ఏలాంటి ముందస్తు సమచారం లేకుండా వందల సంఖ్యలో తోపుడు బండ్లు, ఇతర చిరు వ్యాపారులకు సంబంధించిన సామాగ్రిని అక్కడి నుంచి ఎత్తిపడేశారు. దీంతో దాదాపు 200 కి పైగా చిరువ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
సోమవారం రాత్రి వరకు సాఫీగా అమ్మకాలు సాగించుకుని ఇంటికి వెళ్లిన చిరు వ్యాపారులకు తెల్లవారేసరికి బతుకు చిత్రమే మారిపోయింది. అసలే రంజాన్ సీజన్.. ఈ పండుగ సమయంలో దుకాణాలను ఉన్నట్టుండి వేరే ప్రాంతానికి తరలిస్తే.. వ్యాపారం జరగడం గగనమంటూ చిరువ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలావుంటే.. చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయంగా పాత కలెక్టరేట్ ప్రాంతంలో దుకాణాలను ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
ఉదయం 4 గంటల నుంచే కార్యచరణ షూరూ..
వాస్తవానికి నల్లగొండ (Nalgonda) పట్టణంలోని ప్రకాశం బజార్ లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. ఈ బజారును దాటాలంటే.. రద్దీ వేళల్లో కనీసం గంట సమయం పడుతుంది. రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటే.. ఆ డివైడర్పైనే వందల సంఖ్యలో చిరువ్యాపారులు తమ సామాగ్రిని అమ్ముకుంటుంటారు. సాధారణంగా రంజాన్ మాసంలో ప్రకాశం బజార్ వ్యాపారాలతో కళకళలాడుతుంది. బట్టలు, పాదరక్షలు, పండ్లు, ఇతర సామగ్రి అమ్మే చిరువ్యాపారులకు ఈ నెలలో వచ్చే ఆదాయమే ఏడాది మొత్తం ఆసరాగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో దుకాణాలు తొలగించడం వల్ల లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.
Read Also: ఈ నెల 23న స్టేట్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Follow Us On: Sharechat


