కలం, ఆదిలాబాద్ బ్యూరో: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ, ఉద్యోగ కర్మాగారాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వలస కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల (Swadesh Parikipandla)ను జిల్లా యంత్రాంగం “శ్రమశక్తి అవార్డు”తో గౌరవించింది. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి స్వదేశ్ పరికిపండ్లకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ద్వారా వలస కార్మికులు వారి కుటుంబాలకు అందుతున్న సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రమాద బీమా, మరియు కార్మిక చట్టాల అమలులో స్వదేశ్ పరికిపండ్ల చూపుతున్న చొరవ ఇతర సామాజిక కార్యకర్తలకు ఆదర్శమని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న అనంతరం స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ చేస్తున్న కృషిని గుర్తించి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహాయ కార్మిక కమిషనర్ ఇప్ప ముత్యంరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ గౌరవం ప్రవాసి కార్మికులందరికీ అంకితమని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తమ యూనియన్ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మిక శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

