కలం, వెబ్ డెస్క్: దేశ యువత జాతి నిర్మాణానికి ఉపయోగపడేలా ఆలోచించాలని, దూరదృష్టి కలిగి ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) సూచించారు. స్వేచ్ఛ అంటే నచ్చిన పని చేయడం కాదని.. దేశం కోసం పనిచేయడమని స్పష్టం చేశారు. ఈ ఏడాది లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డు అజిత్ దోవల్కు ప్రకటించగా.. పుణేలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతటా పోరాటాలు జరిగాయో.. ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించారో యువత కచ్చితంగా తెలుసుకోవాలన్నారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గమనిస్తే.. స్వేచ్ఛ విలువేంటో తెలుస్తుందన్నారు.
తిలక్ భయపడలేదు..
స్వాతంత్య్ర పోరాటంలో తిలక్ అసామాన్య పోరాటం చేశారని అజిత్ దోవల్ కొనియాడారు. బ్రిటీషర్లకు భయపడి ఎంతో మంది బయటకు రావాలంటే జంకుతున్న రోజుల్లో.. ఆయన సమాజాన్ని ఏకం చేసి ధైర్యంగా వారిపై పోరాటం చేశారని గుర్తు చేశారు. యువత కూడా తిలక్ వంటి ధైర్య సాహసాలు, పోరాట పటిమను అలవర్చుకోవాలన్నారు. చాలా మంది యువకులు భారత్ ఎప్పటి నుంచో ఇలాగే ఉందని భావిస్తుంటారని.. లోతుగా అధ్యయనం చేస్తేనే దేశం ఎలా మార్పు చెందుతూ వస్తోందనేది తెలుస్తుందన్నారు.

