కలం, నల్లగొండ : మిర్యాలగూడ సమీపంలోని తుంగపాడు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrashekhar) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో తుంగపాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభోత్సవం పై సమావేశం నిర్వహించారు. గతంలో తుంగపాడు వద్ద చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మిగిలిపోయిన చిన్న చిన్న మరమ్మతులు, ఇతర పనులను పూర్తి చేసి లబ్ధిదారుల ద్వారా గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.
ప్రధానంగా తాగునీరు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వంటివి వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. తాగునీటికై బోర్ల ద్వారా సంపులు ఏర్పాటు చేయగా, మున్సిపాలిటీ నుంచి సంపుల్లో నీరు నింపి నిరంతరం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అంతర్గత సిసి రహదారులు, అప్రోచ్ రోడ్డు వేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో ప్రారంభం నుండి చివరి వరకు చెత్తను తొలగించి మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలన్నారు. మొత్తం 10 బ్లాకులలో ఎలక్ట్రికల్ వైరింగ్ శుక్రవారం పూర్తి చేయాలని,పనులు పూర్తయిన ఇళ్లకు తాళాలు వేసి తాళాలు కస్టడీలో ఉంచుకోవాలని ఆదేశించారు.
అలాగే చివరి బ్లాక్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి విషయమై పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని, అంతర్గత రోడ్లకు మట్టి వేసి పూర్తిచేయాలని పంచాయతీరాజ్ అధికారులను, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన శిలాఫలకం, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే 24 గంటలు పని చేసి రాత్రి సమయంలో లైట్లు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని చెప్పారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తుంగపాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తుంగపాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో సమస్యలు అన్నిటిని పరిష్కరించాలని, మిగిలిపోయిన పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి మిర్యాలగూడ ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

