కలం, నేషనల్ బ్యూరో: మత మార్పిడి విషయం (Religious Conversion)పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పును వెలువరించింది. ఇతర మతంలోకి మారిన షెడ్యూలు తరగతులవారికి ఆ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. హిందు, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారినట్లయితే ఎస్సీ హోదా యధావిధిగా కొనసాగుతుందని, ఈ మూడు మినహా ఇతర మతాల్లోకి మారినట్లయితే ఆ హోదా కొనసాగదని జస్టిస్ పీకే మీశ్రా, జస్టిస్ ఎస్వీ అంజారియాలతూ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం పై క్లారిటీ ఇచ్చింది. హిందు, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాల్లోకి మారినట్లయితే వారిని ఎస్సీకి చెందినవారిగా పరిగణించలేమని స్పష్టత ఇచ్చింది. ఈ మూడు మినహా ఏ మతంలోకి మారినా వారి ఎస్సీ హోదా ఆటోమేటిక్గా రద్దవుతుందని పేర్కొన్నది.
గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని దాన్ని అధ్యయనం చేసిన అనంతరం సమర్ధించింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతాన్ని ఆచరిస్తున్నవారు ఎస్సీలుగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును ఉదహరించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పాస్టర్ ఒకరు తాను దళితుడినని పేర్కొంటూ ఎస్సీ-ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద సామాజిక భద్రత కల్పించాలని సుప్రీంకోర్టులో గతంలో ఒక పిటిషన్ను దాఖలు చేశారు. వృత్తిరీత్యా పాస్టర్ అయినందున క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని ఏపీ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పు సందర్భంగా నొక్కిచెప్పింది.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో పిటిషన్ను విచారించిన ధర్మాసనం… రాజ్యాంగ నిబంధనల ప్రకారం క్రైస్తవ, ఇస్లాం మతాల్లో కులవివక్ష ఉండదని, అందువల్ల ఈ రెండు మతాల్లోకి మారినవారికి (Religious Conversion) ఎస్సీ హోదా అవసరమే ఉత్పన్నం కాదని పేర్కొన్నది. ఇలాంటి నేపథ్యంలో వారు ఎస్సీ హోదాను డిమాండ్ చేయలేరని సూచించింది. రాజ్యాంగపరంగా చూస్తే ఎస్సీ హోదా తొలుత కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత 1956లో సిక్కు, 1990లో బౌద్ధ మతాల్లోనే ఎస్సీ హోదా చేరింది.
Read Also: తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
Follow Us On : WhatsApp

