కలం, వెబ్ డెస్క్ : హైకోర్టుల్లో విచారణలు పూర్తయిన తర్వాత తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల లోపు కచ్చితంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన ఆదేశాలు ఇచ్చింది. న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, వేగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నియమాలను తీసుకొచ్చింది.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం కోర్టులో ప్రకటించిన తీర్పును 24 గంటల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అత్యవసర కేసుల విషయంలో ముందుగా ఆపరేటివ్ పార్ట్ ప్రకటించడానికి ప్రయత్నించాలని ధర్మాసనం తెలిపింది. పూర్తి కారణాలతో కూడిన వివరణాత్మక తీర్పును సాధారణ పరిస్థితుల్లో 7 రోజుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో అయితే గరిష్ఠంగా 15 రోజుల్లో అప్లోడ్ చేయాలి. బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే అధికారులకు తెలియజేయాలి. బెయిల్ ఉత్తర్వులు వచ్చిన రోజు లేదా ఆ మరుసటి రోజే నిందితుల విడుదల జరగాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కస్టడీలో ఉన్న అప్పిలెంట్ల కేసుల్లో 7 రోజుల్లోపే అదనపు వివరణలను కోరడానికి వీలుంటుంది.
పెండింగ్లో ఉన్న రిజర్వ్ తీర్పులపై పర్యవేక్షణను సుప్రీంకోర్టు (Supreme Court) మరింత కఠినతరం చేసింది. దీనికోసం ప్రతి నెల ఆటోమేటెడ్ ఈ-మెయిల్ పంపే విధానాన్ని తీసుకురానుంది. రెండు నెలలు దాటినా తీర్పులు వెల్లడించని కేసుల వివరాలను సంబంధిత జడ్జిల దృష్టికి తీసుకెళ్తారు. ఒకవేళ మూడు నెలలైనా తీర్పు రాకపోతే ఆ కేసును నేరుగా చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళతారు. ఆ తర్వాత మరో రెండు వారాలు ఆలస్యమైతే కేసును వేరే బెంచ్కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ విచారణ పూర్తయి నాలుగు నెలలు గడిచినా తీర్పు రాకపోతే, సదరు బెంచ్ను మార్చాలని కోరే హక్కు కేసులోని పక్షాలకు (కక్షిదారులకు) ఉంటుందని సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
Read Also: అభిజిత్ దీప్కే పిటిషన్.. ఎక్స్ (ట్విట్టర్)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Read Also: కెసీఆర్ ను ఇరికించిన బావాబామ్మర్దులు

