కలం, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ కేసులో రాజకీయ వైషమ్యాలు కనిపిస్తున్నాయని, వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు విదేశీ పాస్పోర్ట్, విదేశాల్లో అప్రకటిత ఆస్తులు ఉన్నాయంటూ పవన్ ఖేరా ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా, ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి వారం రోజుల ట్రాన్సిట్ బెయిల్ పొందారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులపై స్టే విధించి గౌహతి హైకోర్టుకు వెళ్లాలంటూ పవన్ ఖెరాకు సూచించింది. దీంతో ఏప్రిల్ 24న గౌహతి హైకోర్టులో పవన్ ఖేరా పిటిషన్ను దాఖలు చేశారు. కానీ దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి భార్యను వివాదంలోకి లాగడం సరైనది కాదని, డాక్యుమెంట్ల మూలాలను తెలుసుకోవడానికి పోలీసు కస్టడీ అవసరమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఖేరా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులు మాత్రమేనని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అనంతరం పవన్ ఖేరాకు ముందస్తు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

