కలం, కరీంనగర్ బ్యూరో : రాజా బహదూర్ వెంకట రామ రెడ్డి (Raja Bahadur Venkatarama Reddy) ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుడా చైర్మెన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) పిలుపునిచ్చారు. పోలీస్ కొత్వాల్ స్వర్గీయ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 73వ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వారి విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘వారి ఆశయాలను కొనసాగిద్దాం’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కొత్వాల్గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. వారి ఆశయాల మేరకు కరీంనగర్లో ఆర్బీవీఆర్ బి.ఎడ్ కళాశాలను స్థాపించి విద్యార్థులకు విద్య అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బి.ఎడ్ కళాశాలలోని వారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, రెడ్డి కుల బంధువులు, కళాశాల ఆచార్యులు, ఇతరులు పాల్గొన్నారు.

