కలం, మెదక్ బ్యూరో : రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు (Steel Banks) ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో పాటు, ప్రజలు వివిధ రకాల క్యాన్సర్ భారిన పడుతున్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేదిశగా స్టీల్ బ్యాంకులు నిర్వాహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
గ్రామ గ్రామన స్టీల్ బ్యాంకులు
శుభకార్యాలు, సామాజిక వేడుకలు, సమావేశాలు ఏవైనా.. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులతో నిండిపోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ శుభ, అశుభ కార్యక్రమం జరిగినా వందలాది ప్లేట్లు, గ్లాసులు వినియోగించి ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు. ఇక విందులు, పార్టీల సమావేశాల సందర్బంగా వేలాది ప్లాస్టిక్ వినియోగిస్తుంటాము. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, ప్రజల అరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించే అలోచనలో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వినూత్న అలోచన చేశారు. తన తండ్రి పొన్నం సత్తయ్య ట్రస్ట్ అధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో విరివిగా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలోని 280 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ వస్తువులతో కూడిన స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 580 హోటల్స్ కు ఒక్కో హోటల్ కు 100 చోప్పున టీ గ్లాసులు అందించారు. గ్రామ జనాభాను బట్టి మహిళా సంఘాలకు స్టీల్ వస్తువులను ఇచ్చారు. నియోజకవర్గంలోని 85 గ్రామాల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టీల్ బ్యాంకు లో 500 భోజనం ప్లేట్లు, 250 టిఫిన్ ప్లేట్లు ,250 గ్లాస్ లు, 250 టీ గ్లాస్ లు, డిష్ లు, బకెట్లు, గంటెలు ఉంటాయి.
సామాజిక బాధ్యత..
గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు దర్శనిమిస్తున్నాయి. విందుల్లో పూర్తిగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు జరిగినప్పడు దీంతో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా గ్రామంలోని మహిళ సంఘాల నుండి స్టీల్ బ్యాంకు లోని 13 రకాల స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచారు. వీటితో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది. స్టీల్ బ్యాంకుల (Steel Banks) ఏర్పాటుతో ప్లాస్టిక్ ను నిర్మూలించడంతో పాటు, ప్రజల అరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. ప్రసుత్తం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతు, వివిధ రకాల క్యాన్సర్ కు కారణమవుతున్న ప్లాస్టిక్ ను వాడకాన్ని తగ్గించే విధంగా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంకులను అందుబాటులో ఉంచారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే ప్రతి సంవత్సరం దాదాపు 3650 మెట్రిక్ టన్నుల పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలు వెలువడుతున్నాయి. అందోళనకర స్ధాయిలో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగంకు తగ్గించేందుకు ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్టీల్ బ్యాంకులను సద్వినియోగం చేసువాల్సిన అవసరం ఉంది.
ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమిష్టి కృషితో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు నియోజకవర్గంలో అమలు అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం ద్వారా శుభకార్యాలు, సామాజిక వేడుకలు, సమావేశాల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇది కేవలం వ్యర్థాలు తగ్గించడానికే మాత్రమే కాకుండా పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన తెలంగాణ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
Read Also: ఉదండాపూర్ రిజర్వాయర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

