ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు

కలం, వెబ్​ డెస్క్​ : ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలన్న ఆలోచన కూడా భయపెట్టేలా ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం చాలా మంది ఏసీలు, కూలర్లు వంటివి వాడుతుంటారు. వాటితో పాటు కూల్‌డ్రింగ్స్ వంటివి కూడా హెవీగా తాగేస్తారు. కానీ వీటి వల్ల శరీరంపై దుష్ప్రభావమే ఎక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎండలతో పాటు పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే, వేసవిని ఒక భారంగా కాకుండా, శరీరాన్ని తిరిగి సమతుల్యతలోకి తెచ్చుకునే ఒక అవకాశంగా చూడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘యు బ్యాలెన్స్ నేచురల్స్’ కో-ఫౌండర్ గురుమీత్ కౌర్, వేసవి తాపాన్ని తట్టుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద రహస్యాలను (Ayurvedic Tips) పంచుకున్నారు.

నీటితోనే శ్రీకారం

వేసవిలో ఆరోగ్యం కేవలం ఒక గ్లాసు నీటితోనే మొదలవుతుంది. నిద్రలేవగానే శరీరంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా చిటికెడు పసుపు కలుపుకుని తాగాలని నిపుణులు చెప్తున్నారు. ఇది శరీరాన్ని నిదానంగా నిద్రలేపి, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది.

ఆహారంలో మార్పులు

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. అందుకే వేసవిలో “తక్కువ తినడం – ఎక్కువ లాభం” అనే సూత్రాన్ని పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం, కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయట తిరగకుండా ఉండటం వల్ల శరీర శక్తి వృధా కాకుండా కాపాడుకోవచ్చు.

శరీరాన్ని కూల్ చేసే ప్రాణాయామం

శ్వాసక్రియ ద్వారా శరీరాన్ని చల్లబరచడం ఆయుర్వేదంలోని ప్రత్యేకత. వేసవి వేడిని తగ్గించడానికి ‘శీతలి’, ‘శీత్కారి’ వంటి ప్రాణాయామాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత కోసం ‘అనులోమ్ విలోమ్’ తో పాటు బాలాసనం, విపరీత కరణి వంటి ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. రోజుకు కేవలం 5 నుంచి 10 నిమిషాలు కేటాయిస్తే మనస్సు, శరీరం రెండూ సమతుల్యంగా ఉంటాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఏసీ గదుల నుంచి ఒక్కసారిగా బయటకు రావడం, అలాగే బయట నుంచి రాగానే చల్లటి ఏసీలోకి వెళ్లడం వంటివి శరీరానికి షాక్ ఇస్తాయి. వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడటానికి తగిన సమయం ఇవ్వాలని గురుమీత్ కౌర్ హెచ్చరించారు. సాయంత్రం వేళల్లో తేలికపాటి భోజనం చేసి, ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని, తద్వారా శరీరం త్వరగా కోలుకుంటుందని ఆమె వివరించారు.

Read Also: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. కానీ ఆ 30 నిమిషాలే సమస్య!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>