కలం, వెబ్డెస్క్: దేశ అభివృద్ధి పథంలో ‘స్టార్టప్ ఇండియా’ ఒక విప్లవంలా మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, తద్వారా మరికొంత మందికి ఉపాధి లభించేలా చేయడం కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విశిష్ట పథకానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వివిధ ఆవిష్కరణలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు. దీనికి కారణం స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ (Startup India) అని పేర్కొన్నారు. 2014లో కేవలం 4 స్టార్టప్లతో ప్రారంభమైన స్టార్టప్ ఇండియాలో ప్రస్తుతం 2లక్షల స్టార్టప్లు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 125కు పైగా యూనికార్న్లు ఉన్నాయన్నారు. ఇవి ఐపీవోలను ప్రారంభించి వేలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. టైర్–2, టైర్–3 నగరాల్లోని యువతతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు సైతం స్టార్టప్ ఇండియా ద్వారా స్వయం సమృద్ధి సాధిస్తుండడం గర్వకారణమన్నారు.
స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ మహిళల అభున్నతిలోనూ తన వంతు పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్లలో దాదాపు 45 శాతం వరకు కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా మహిళా భాగస్వామి ఉండడం దీనికి నిదర్శమని చెప్పారు. భద్రమైన భవిష్యత్తు కోసం రిస్క్ తీసుకునే ధోరణి భారతీయ యువతలో పెరిగిందని ఆయన కొనియాడారు. భారతీయ స్టార్టప్ల ఫౌండర్స్ ఆత్మవిశ్వాసం, ఆశయాలు అభినందనీయమని ప్రశంసించారు. ‘భారతీయ యువత ఒక గీత గీసుకొని అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలని కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన పరిధిలో పనిచేయాలని అనుకోవడం లేదు. రిస్క్ తీసుకుంటున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు’ అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
Read Also: దాయాదులు ఒక్కటైనా.. దక్కని ఫలితం!
Follow Us On: Pinterest


