కలం, నల్లగొండ బ్యూరో : బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Krishna Rao) అన్నారు. నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనంలో మూడో బుద్ధ దమ్మ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందన్నారు. బుద్ధుని బోధనలైన కరుణ, ప్రేమ, దయ వంటి వాటిని ప్రజల హృదయాల్లో తిరిగి నింపేందుకు బౌద్ధ బిక్షువులు నెలరోజుల పాటు కర్ణాటకలోని కాలబురిగి నుండి తెలంగాణలోని బుద్ధవనం దాకా పాదయాత్ర చేసి సందేశం ఇచ్చారని చెప్పారు మంత్రి. బుధవనాన్ని వరల్డ్ క్లాస్ హెరిటేజ్ కేంద్రంగా తీర్చి దిద్దుతామని, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి గ్లోబల్ బుద్ధిష్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దమ్మయాత్ర ప్రారంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో బుద్ధవనం ప్రపంచానికే వెలుగునిస్తుందని మంత్రి తెలిపారు.
బుద్ధుని బోధనలను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారూపాల ద్వారా గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని, అంతేకాక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Krishna Rao) వివరించారు. ఇందులో భాగంగానే రచయితలు అందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలను తీసుకోవడం ద్వారా “ప్రభాథ్ భేరి”పేరుతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు మంత్రి జూపల్లి. కార్మిక ఉపాధికల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని, శాంతియుతంగా ,ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. బుద్ధవనం రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందన్నారు. బుద్ధవనాన్ని టూరిజం మాన్యుమెంట్ గా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బి.చంద్రశేఖర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, బుద్ధ సాంస్కృతిక అంబాసిడర్ గగన్ మాలిక్, బుద్ధ వనం స్పెషలాఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ్, థాయ్ ల్యాండ్ బౌద్ధ సన్యాసులతోపాటు వచ్చిన శ్రీలోక్ కుంతూ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

