కలం, వెబ్ డెస్క్: పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాస్పత్రులు తీరు మారడం లేదు. రోగులకు కావాల్సిన కనీస సౌకర్యాలకు దిక్కులేకపోవడంతో నేటికి ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితి నెలకొంది. బెడ్లు, అంబులెన్స్, సెలైన్ బాటిళ్లు, స్ట్రెచర్స్, విశ్రాంతి గదులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. చివరకు శవాలకూ (Dead Body) భద్రత లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి నెలకొనడంతో శవాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. ఈ దారుణ ఉదంతం ప్రభుత్వ హాస్పిటల్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళ్తే..
జడ్చర్ల (Jadcherla) మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు. సోమవారం మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని భద్రపరచాల్సిన సిబ్బంది.. కనీసం స్ట్రెచర్ మీద కూడా పెట్టకుండా మార్చురీ (Mortuary)లో పడేయడంతో కుక్కలు పీక్కుతీన్నాయి.
మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు కూడా లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుడి బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

