కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ (SSC paper leak) ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బోధన్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు లీక్ కావడాన్ని సీరియస్ గా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం 9 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి మొదట సెకండ్ లాంగ్వేజ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం ఆలూరు, బోధన్, మెండోరా ఎగ్జామ్ సెంటర్ల నుంచి ఈ పేపర్ లీక్ (SSC paper leak) అయినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆలూరు కేంద్రం నుంచి రాజేందర్, విజయ్ కుమార్, సాగర్, ఉమేందర్ లను సస్పెండ్ చేశారు. అలాగే మెండోరా కేంద్రంలో పనిచేస్తున్న మమత, రవీందర్, భూపతిలపై వేటు పడింది. బోధన్ ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించి వేణు, శివానందరావులను విధుల్లో నుంచి తొలగిస్తూ కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

