కలం, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో బుధవారం వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు (Salakatla Vasanthotsavam) వైభవంగా కొనసాగనున్నాయి. చైత్రశుద్ధ పౌర్ణమికి ఉత్సవాలు ముగిసేలా టీaటీడీ ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం 8 గంటలకు బంగారు రథంపై శ్రీ భూదేవి, శ్రీదేవి సామెత మలయప్పస్వామి వారిని ఊరేగించనున్నారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి విశేషంగా భక్తుల తిరుమలకు రానున్నారు. బుధవారం వసంత మండపానికి ఉత్సవమూర్తులు మలయప్పస్వామి, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను తీసుకురానున్నారు. అక్కడ అభిషేకం, నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి తీసుకురానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. తిరుమలలో సాయంత్రం 6 గంటలకు అర్చకులు ఆస్థానం నిర్వహించనున్నారు.
ఇక చివరిరోజు భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 30 నుంచి ఏప్రిల్ 01 వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవలు వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అటు తిరుపతిలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం తిరుమల స్వామివారిని గవర్నర్ దర్శనం చేసుకోనున్నారు.
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం రూ.5.08 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. లక్ష్మణ సమేత శ్రీ సీతారామ చంద్రస్వామివారిని భక్తులు దర్శించుకుని పునీతులవుతున్నారు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు విశేష భక్తజనం రావడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అడుగడుగునా భక్తులు సీతారామ లక్ష్మణులకు కర్పూర హారతులు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. మాడ వీధుల్లో, గ్రామ పుర వీధుల్లో రాములోరిని ఊరిగింపులు నిర్వహించారు. భజన బృందాల గానాలు, కోలాటాల నడుమ వీధుల్లో వాహన సేవ వైభవంగా సాగింది. అటు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒంటిమెట్టలో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 వరకు వైభవంగా కొనసాగనున్నాయి.

