కలం, ఖమ్మం బ్యూరో: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో (Bhadrachalam) శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం నిత్య కల్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కమనీయమైన వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష అర్చనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు శాస్త్రోక్తంగా, వైదికంగా శ్రీ సీతా రాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టాన్ని ఘనంగా ప్రారంభించారు. వేద పండితుల పవిత్రమైన మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణ తంతు కనులపండువగా సాగింది. భక్తుల జయజయధ్వానాలు, రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తి భావంతో పులకించిపోయింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.

