కలం, స్పోర్ట్స్ : హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు (SRH vs RR)లో వార్ వన్సైడ్ అయిపోయింది. ఛేజింగ్కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్కు ఎస్ఆర్హెచ్ యువ బౌలర్లు ఇద్దరు చుక్కలు చూపించారు. వాళ్లే ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. వారి దెబ్బకు రాజస్థాన్ 159కే ఆలౌట్ అయింది. దీంతో ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన ప్రఫుల్.. వైభవ్, జురెల్, ప్రిటోరియస్ వికెట్లను తొలి ఓవర్లోనే తీసి రాజస్థాన్ను చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన హుస్సేన్.. రాజస్థాన్కు ఉన్న ఏకైక అండ యశస్వీ జైస్వాల్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ ఓటమి ఖరారు అయిపోయింది. కాగా ఆ తర్వాత రంగంలోకి దిగిన జడేజా, ఫెరీరా పోరాడారు. అతి కష్టంపైన స్కోర్ను ముందుకు నడిపించారు. ఆ తర్వాత మరోసారి హుస్సేన్ చెలరేగాడు. మొత్తం ఈ మ్యాచ్ (SRH vs RR) లో యువ బౌలర్లు ప్రఫుల్, హుస్సేన్ దెబ్బకు రాజస్థాన్ విలవిలలాడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) తొలి బంతికే అవుటైనా, ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేసి రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ (40), నితీష్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24*) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ పటిష్ట స్థితికి చేరుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓవర్లోనే ఊహించని షాక్
అనంతరం 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న విదర్భ పేసర్ ప్రఫుల్ హింజ్ సంచలనం సృష్టించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ (0), ధ్రువ్ జురెల్ (0), లువాన్-డ్రే ప్రిటోరియస్ (0)లను వరుసగా పెవిలియన్ పంపి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన మొదటి బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత సాకిబ్ హుస్సేన్ పదునైన బౌలింగ్తో స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను (1) వెనక్కి పంపడంతో రాజస్థాన్ 2 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (4) కూడా ప్రఫుల్ బౌలింగ్లోనే అవుట్ కావడంతో రాజస్థాన్ పతనం ఖాయమైంది.
మధ్యలో డోనోవన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45) అద్భుత పోరాటం చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, సన్రైజర్స్ బౌలర్ల ధాటికి అది సరిపోలేదు. చివర్లో సాకిబ్ హుస్సేన్ వరుస వికెట్లు తీస్తూ రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, ప్రఫుల్ హింజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈషన్ మలింగకు రెండు వికెట్లు దక్కాయి. తుషార్ దేశ్పాండే (25*) చివర్లో కొన్ని సిక్సర్లు బాదినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ 18.6 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 58 పరుగుల భారీ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

