కలం, వెబ్ డెస్క్: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (DSHS)లో పని చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ (Telangana Nurses Association) ప్రతినిధులు సోమవారం కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మార్చి 2026 నెల జీతాలు ఇంకా విడుదల కాకపోవడంతో నర్సింగ్ అధికారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ఇంటి ఈఎంఐలు, పిల్లల పాఠశాల ఫీజులు, నిత్యవసర ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నందున పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అసోసియేషన్ కోరింది. నర్సుల విన్నపాన్ని సానుభూతితో పరిశీలించిన కమిషనర్, జీతాల విడుదలకు త్వరలోనే సానుకూల పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

