కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలోని పెండింగ్ కేసుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సమగ్ర దర్యాప్తును చేపట్టాలన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరతగతిన శిక్షపడే విధంగా కృషిచేయాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్స్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు (Crimes) పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. వేసవి కాలం సెలవుల దృష్ట్యా దొంగతనాలు జరగకుండా గస్తీ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేసి బాధిత మహిళలకు అండగా నిలబడాలన్నారు. ఈ సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
Read Also: జీతాలు కట్ చేసిన సీఎం.. దేశంలోనే మొదటిసారి!
Follow Us On : WhatsApp

