కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని అభాగ్యులందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉందనే భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) నొక్కి వొక్కానించారు. సోమవారం కొత్తగూడెంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో పోలీసు అధికారులందరితో నేర సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
క్రికెట్ బెట్టింగులు, ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేయాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై క్రమ శిక్షణాచర్యలు తప్పవని హెచ్చరించారు.
భద్రాచలంలో ఈ నెల 27న జరగబోయే శ్రీరామనవమికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని దొంగతనాల నివారణకై ప్రజలను అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించరాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వ్యక్తులపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్, సిఐలు, ఎస్సైలు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

