కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. చిల్పూర్ (Chilpur) మండలంలోని ఒక హైస్కూల్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జనగణన కార్యక్రమం సందర్భంగా ఆ టీచర్ ఒక విద్యార్థినిని అనవసరమైన ప్రశ్నలు అడిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రాజు పాఠశాలకు వెళ్లి ఆమెను ప్రశ్నించారు. అయితే టీచర్ ప్రవర్తన మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
సర్పంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, పుస్తకాలను విసరడం, వెకిలిగా నవ్వడం, హెడ్మాస్టర్ కుర్చీలో కూర్చోవడం వంటి విచిత్ర ప్రవర్తన చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులతో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన ఉన్న టీచర్ మాకు వద్దంటూ నిరసనకు దిగారు. పాఠశాలలో విద్యార్థుల భద్రత, భవిష్యత్తు దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

