కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే రోజుల్లో ప్రతి ఓటును కాపాడుకోవడమే లక్ష్యంగా ఖమ్మం (Khammam) నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) బూత్ కమిటీ సభ్యులకు పార్టీ అధిష్ఠానం స్పష్టమైన టాస్క్ ఇచ్చింది. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR), డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై విస్తృత అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్, నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
రఘునాథపాలెం, ఖానాపురం హవేలీ మండలాలు, టూ టౌన్ పరిధిలోని బూత్ కమిటీ సభ్యులకు SIR ప్రక్రియపై ఈ సందర్భంగా సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడే బాధ్యత క్షేత్రస్థాయి కార్యకర్తలపైనే ఉందని ముఖ్య నేతలు స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని వివరాలను పరిశీలించాలని, జాబితాలో ఎలాంటి లోపాలున్నా వెంటనే గుర్తించి సవరణలు చేపట్టాలని సూచించారు. ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలను నిర్ణీత గడువులోపు సమర్పించేలా బూత్ కమిటీలే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ ముగిసే వరకు పార్టీ నాయకత్వం జిల్లా ప్రజలకు, శ్రేణులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎలా సాగుతుందో పర్యవేక్షించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. బూత్ కమిటీ సభ్యులకు లేదా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్క అర్హత ఉన్న ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ డివిజన్ల బాధ్యులు, బూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

