కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ బోనాల (Bonalu) ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న వైభవంగా నిర్వహించనున్నారు. జులై 19న ఘటాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు అధికారికంగా ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన అమ్మవారికి బోనాల సమర్పణ ఆగస్టు 2న జరగనుంది. ఆ మరుసటి రోజు ఆగస్టు 3న ‘రంగం‘ (భవిష్యవాణి) ఉంటుంది. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు అందజేశారు. మరో నెలరోజుల్లో నగరంలో ఈ బోనాల జాతరలు ప్రారంభం కానుండటంతో భక్తులలో ఇప్పుడే కోలాహలం మొదలైంది.
హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల (Bonalu) ఉత్సవాలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ పండుగలో భాగంగా మొట్టమొదటి బోనాన్ని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆషాఢ మాసం ప్రారంభమైన తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

