కలం, వెబ్ డెస్క్ : నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS Report)లో ఊహించని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రసవాల తీరుతెన్నులపై జరిగిన ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దేశ సగటు సిజేరియన్ల శాతం 22.9 శాతంగా ఉంటే, తెలంగాణలో అది ఏకంగా 62.2 శాతానికి చేరడం గమనార్హం. ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు అధికం కావడం వైద్య రంగ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 48.6 శాతం సిజేరియన్లు జరుగుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ 52.2 శాతం ప్రసవాలు సిజేరియన్ల ద్వారానే సాగుతున్నాయి.
ఆరోగ్య పరంగా తెలంగాణను మరో పెద్ద ముప్పు కూడా కలవరపెడుతోంది. మధుమేహం (Diabetes/Sugar) వ్యాధిలోనూ రాష్ట్రం జాతీయ సగటును దాటేసింది. ఇక్కడి పురుషుల్లో 28.2 శాతం మంది, మహిళల్లో 24.2 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

