కలం, కరీంనగర్ బ్యూరో: రాబోయే 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. ఆయా నిధులతో కరీంనగర్ లో మోడల్ రోడ్లను నిర్మించడంతో పాటు స్కై వాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మిస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్ (Karimnagar) శివారు ప్రాంతాల్లోని గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి 47వ డివిజన్ లోని రాంనగర్ సిద్దార్థ స్కూల్ సమీపంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు రూ.98 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం బండి సంజయ్ (Bandi Sanjay) మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అందించిన 100 రోజుల్లోనే యూడీఎఫ్ నిధులను తీసుకొచ్చామన్నారు. ‘మాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం… సమస్యల్లేని డివిజన్ గా తీర్చిదిద్దుతా.. గతంలో నిధుల్లేక ఇబ్బందులు పడేవాళ్లం.. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండేది. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే యూసీఎఫ్ ఫండ్ ఇస్తే ఆ జాబితాలో కరీంనగర్ కూడా చేరింది. కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధిలో అగ్రగామిగా, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా‘ అని బండి సంజయ్ వెల్లడించారు.
Read Also: సీఎం రేవంత్కి పవన్ కళ్యాణ్ కీలక లేఖ
Follow Us On: Instagram

