కలం, శాలిగౌరారం : శాలిగౌరారం (Shaligouraram) మండల కేంద్రంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. శాలిగౌరారం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు (కోత కోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లకు) నిప్పు పెట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ మంటలు క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా మారి భారీగా చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపిస్తూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వైపు దూసుకురావడాన్ని అక్కడే ఉన్న ఎస్ఐ సైదులు గమనించారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వెంటనే స్థానిక రైతులతో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ సైదులు, పోలీసు సిబ్బంది, స్థానిక రైతులు కలిసి శ్రమించి మంటలు మరింత ముందుకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అందరూ సకాలంలో స్పందించడం వల్ల పోలీస్ స్టేషన్ భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సమీపంలోనే ఉన్న రైతుల గడ్డి వాములు బూడిదవ్వకుండా కాపాడగలిగారు. పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్కు పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే భారీ ఆస్తి నష్టం సంభవించి ఉండేదని స్థానికులు అన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గాలుల తీవ్రత, ఎండలు ఎక్కువగా ఉన్నాయని, రైతులు ఎవరూ కూడా పంట పొలాల్లోని వరి కొయ్యలకు, కట్టెలకు నిప్పు పెట్టవద్దని ఎస్ఐ సైదులు తెలిపారు.

