కలం, ములుగు జిల్లా: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ఇంచర్ల ఏకో పార్క్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అటవీ సంరక్షణాధికారి కాళేశ్వరం జోన్ బి.ప్రభాకర్ ఐఎఫ్ఎస్ తో కలిసి మంత్రి సీతక్క (Seethakka) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క, సీసీఫ్ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. స్వార్థం కోసం చెట్లు నరకడం వల్ల అడవులు ఎడారులుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 64 శాతం అటవీ ప్రాంతం ఉందని, అడవుల లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇంచర్ల సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

