కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనపై రాష్ట్రంలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్కు బీజేపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. కాగా తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఈ అంశంపై స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా? ఆయనకు ఈ రాష్ట్రాన్ని రాసిచ్చారా?‘ అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ఫోకస్ పెట్టకుండా అనవసర విషయాలపై రాజకీయం చేస్తోందని విమర్శించారు.
కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్రం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు. లారీల కొరత పేరుతో రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. అగ్రికల్చర్ పాలసీపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని.. సకాలంలో ధాన్యం సేకరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

