కలం, వెబ్ డెస్క్ : అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగ ఖైదీల హక్కులను (Disabled Prisoners Rights) పరిరక్షించాలని, దీనికోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించి, అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగ ఖైదీల హక్కుల పరిరక్షణ, సౌకర్యాల కల్పనపై దాఖలైన ఓ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ శనివారం విచారించింది.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జైళ్లలో సౌకర్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని బెంచ్ తెలిపింది. ఇది దివ్యాంగ ఖైదీల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ‘ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ –2016’ (The Rights of Persons with Disabilities Act – 2016) ను సంపూర్ణంగా అమలు చేయడంలో ఇబ్బందిగా మారాయని బెంచ్ పేర్కొంది. అందువల్ల దివ్యాంగ ఖైదీలకు కావల్సిన ర్యాంప్ లు, పరికరాలు, అనుగుణమైన బాత్ రూమ్ లు, చికిత్సా సౌకర్యాలు కల్పించాలని సూచించింది.
వీల్ ఛెయిర్లు, హియరింగ్ డివైస్ లు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, రెగ్యులర్ ఫిజియోథెరపీ వంటివి అందుబాటులో ఉంచాలని చెప్పింది. అలాగే జైళ్లలో దివ్యాంగ ఖైదీలను ఇతర ఖైదీలు వెక్కిరించడం, ఎగతాళి చేయడం వంటి వేధింపులను అరికట్టేందుకు నిఘాను పటిష్టం చేయాలంది. చదువుకునే అవకాశాలూ కల్పించాలని చెప్పింది.ఎల్. మురుగనాథమ్ వెర్సస్ తమిళనాడు స్టేట్ కేసులో దివ్యాంగ ఖైదీల హక్కుల (Disabled Prisoners Rights) పరిరక్షణకు ఇంతకుముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతోపాటు తాజాగా తాము ఇచ్చిన ఆదేశాలనూ అమలయ్యేలా సరైన ప్రణాళికలు రూపొందించి తమకు అందజేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
Read Also: 3 ట్రిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా?
Follow Us On: Instagram


