కలం మెదక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారంలో నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచుతూ ప్రజలను దోచుకుంటోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ((Chinta prabhakar) ఫైర్ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుండా ఆ దోపిడీలో భాగస్వామి అవుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ కారణంగా తెలంగాణ ప్రజలపై ప్రతి నెలా సుమారు రూ.162 కోట్ల అదనపు భారం, ఏడాదికి దాదాపు రూ.2 వేల కోట్ల పన్నుల భారం పడుతోందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. వ్యవసాయ పనులకు డీజిల్ భారం, సామాన్యుల వాహనాలు నడుపుకోవాలంటే పెట్రోల్ భారం అయిపోందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై విమర్శలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యాట్ విధానంపై ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు.

