కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని మండల కేంద్రంలోని జాకోర చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. ప్రయాణికుల కోసం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం, టిప్పర్ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వర్ని పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

