కలం, వెబ్డెస్క్: టెన్నిస్ కోర్టులో 18 ఏళ్ల రిషితా రెడ్డి బసిరెడ్డి (Rishitha Reddy Basireddy) సరికొత్త రికార్డు సృష్టించింది. బెళగావిలో జరిగిన మహిళల ఏఐటీఏ (AITA) రూ. 1 లక్ష ప్రైజ్ మనీ టోర్నమెంట్లలో వరుసగా రెండు టైటిళ్లను గెలుచుకుని తన ప్రస్థానాన్ని ఘనంగా చాటుకుంది. తొలి టోర్నీ సెమీఫైనల్లో ఆయుషి తన్వర్ను ఓడించిన రిషిత, ఫైనల్లో వెన్నెల రెడ్డి గారుగుపాటిపై 6-2, 6-0తో గెలిచి మొదటి ఏఐటీఏ టైటిల్ను అందుకుంది. అదే ఊపుతో రెండో టోర్నీలోనూ దూసుకెళ్లింది. సెమీస్లో కార్తీక పద్మకుమార్ను చిత్తు చేసి, ఫైనల్లో దియా వివేకానందన్పై 6-2, 6-0తో విజయం సాధించి రెండో ఏఐటీఏ టైటిల్ను కూడా కైవసం చేసుకుంది.
ఈ రెండు టోర్నీల్లో రిషిత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమెలోని ఆత్మవిశ్వాసం, మ్యాచ్పై పట్టు, ఒత్తిడిని తట్టుకునే విధానం అద్భుతమని ఆమె మద్దతు బృందం పేర్కొంది. మహిళల కేటగిరీలోకి అడుగుపెడుతూనే వరుసగా రెండు ఏఐటీఏ టైటిల్స్ గెలవడం రిషిత కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ విజయాలు ఆమెను ఒక వర్ధమాన క్రీడాకారిణిగా నిలబెట్టాయి.

