కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త అందుతోంది. సనత్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Sanathnagar TIMS) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆసుపత్రిలో ట్రయల్ రన్ షురూ అయ్యింది. సుమారు నెల రోజుల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది.
ఇందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ (OP), డయాగ్నస్టిక్ సేవలను అందిస్తారు. వీటితోపాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలతో సహా మొత్తం 22 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి పనితీరును పరిశీలించి త్వరలోనే పూర్తి స్థాయిలో వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని నోడల్ అధికారి డాక్టర్ మెహబూబ్ ఖాన్ తెలిపారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ టీమ్స్ ను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు జూన్ 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారని సమాచారం అందుతోంది.

