కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ ఆమోదించిన శాలరీ కట్టింగ్ బిల్లు (Salary Cutting Bill)పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని వ్యాఖ్యానించారు. దీనిపై సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులని సజ్జనార్ పేర్కొన్నారు. మానవీయ విలువలు కనుమరుగవుతున్న కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులను రోడ్డు పాలు చేస్తున్నారని, అలాంటి ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతోందని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక బిల్లును కేబినెట్లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పుగా పేర్కొన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామమన్నారు. ఇది బాధ్యతను విస్మరిస్తున్న వారికి వారి కర్తవ్యాన్ని గుర్తు చేసే ఒక హెచ్చరిక అని చెప్పారు.
ఈ బిల్లు దేశానికి స్పూర్తిదాయకమని సజ్జనార్ (Sajjanar) వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి అని కొనియాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు విలాసాలు కోరుకోరని, కేవలం తమ బిడ్డల ప్రేమ, తోడును మాత్రమే కోరుకుంటారని చెప్పారు. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: బడ్జెట్ మంటలు.. అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి vs శ్రీధర్ బాబు
Follow Us On: Sharechat

