కలం, వెబ్ డెస్క్: ఇన్స్టా రీల్స్ చూస్తుందనే కోపంతో భర్త, భార్యను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి (20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఉపాధి నిమిత్తం కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వలస వెళ్లారు. ధీరజ్ చిన్న చిన్న కూలీ పనులు చేస్తుండగా.. రీమా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ప్రశాంతంగా సాగుతున్న వీరి జీవితంలో ఇన్స్టా రీల్స్ చిచ్చు మొదలైంది. భార్య రీమా రీల్స్ చూస్తూ ఇంట్లో పని సరిగా చేయడం లేదని, సకాలంలో వంట కూడా చేయడం లేదని ఆరోపిస్తూ ధీరజ్ ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఘటన జరిగిన రోజున ఈ విషయమై దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైన ధీరజ్.. భార్య రీమా గొంతు నులిమి చంపేసి, ఇంట్లోనే టాయిలెట్ సమీపంలో పడేసి అక్కడి నుంచి తన స్వస్థలం అయిన బీహార్కు పరార్ అయ్యాడు.
అయితే రీమా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆఫీసుకు వెళ్లకపోవడంతో తన స్నేహితులు ఇంటికెళ్లి చూశారు. ఇంట్లో దుర్వాసనతో రావడంతో ఇళ్లంతా చెక్ చేశారు. ఇంట్లోనే టాయిలెట్ సమీపంలో విగతజీవిగా పడి ఉన్న రీమాను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీహార్కు పరారైన నిందితుడు ధీరజ్ కుమార్ను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించి విచారించారు. ఈ విచారణలో ధీరజ్.. భార్య రీమా కుమారి ప్రవర్తన నచ్చకపోవడంతో గొంతు నులిమి చంపేశానని నేరాన్ని అంగీకరించాడు.

