కలం, మహబూబ్నగర్ బ్యూరో: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (Amrabad Tiger Reserve)లోని అన్ని సఫారీ (Safari) సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అమ్రాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామ్మూర్తి తెలిపారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టిసిఏ) మార్గదర్శకాల మేరకు, అడవి జంతువుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.
ఈ నిర్ణయం పులులు, ఇతర వన్యప్రాణులు ఎలాంటి అంతరాయం లేకుండా సహజ వాతావరణంలో సంచరించడానికి, సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణను సురక్షితంగా కొనసాగించడానికి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, పర్యాటకులు, ప్రజలందరూ ఈ తాత్కాలిక సఫారీ నిలిపివేతకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో విలువైనదని, ఆయన తెలిపారు. ఎన్టిసిఏ మార్గదర్శకాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్టోబర్ 1 నుండి సఫారీ సేవలు పునఃప్రారంభించబడతాయని ఆయన తెలిపారు.

