కలం, స్పోర్ట్స్ : భారత్తో టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐపీఎల్ సహా అన్ని ఫ్రాంచైజీ లీగ్లను పక్కన పెట్టేశానని, తనకు ఇంగ్లండ్ క్రికెట్ మాత్రమే ముఖ్యమని తేల్చిచెప్పాడు. దేశం కోసం ఆడటానికే తన కెరీర్ అంకితం అని స్పష్టం చేశాడు. ఐపీఎల్, పీఎస్ఎల్, ఇతర ఫ్రాంచైజీ టోర్నీల్లో ఆడే ఉద్దేశం లేదని బ్రూక్ వెల్లడించాడు. ది హండ్రెడ్ మినహా మరే లీగ్లోనూ కనిపించబోనని తెలిపాడు. తన ప్రతి నిర్ణయం ఇంగ్లండ్ జట్టు ప్రయోజనాల కోసమే ఉంటుందని, వ్యక్తిగత లాభాల కోసం ఫ్రాంచైజీ క్రికెట్ను ఎంచుకోలేదని వివరించాడు.
అందుకే ఫ్రాంచైజీలకు దూరం
ఫ్రాంచైజీ క్రికెట్ ఆడకపోవడం వల్ల శరీరాన్ని మరింత ఫిట్గా ఉంచుకునే అవకాశం దొరుకుతుందని బ్రూక్ (Harry Brook) చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్కు ఆడటమే తన చిన్ననాటి కల అని, దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టానని వెల్లడించాడు. భవిష్యత్లో టెస్టు కెప్టెన్ అవుతారా అనే ప్రశ్నకు కూడా బ్రూక్ ప్రశాంతంగా స్పందించాడు. కెప్టెన్ అవ్వడం కంటే ఇంగ్లండ్ తరఫున ఆడుతూనే ఉండటం తనకు పెద్ద గౌరవమని చెప్పాడు.
భారత్తో పోరుకు ఇంగ్లండ్ రెడీ
బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్లో భారత్తో జరిగే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. జామీ ఓవర్టన్ స్థానంలో సాకిబ్ మహ్మూద్, జోఫ్రా ఆర్చర్ స్థానంలో ల్యూక్ వుడ్ను ఎంపిక చేసింది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడిన ఆర్చర్, జోష్ టంగ్కు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత మళ్లీ భారత్తో తలపడుతున్న ఇంగ్లండ్కు ఈ సిరీస్ కీలకంగా మారింది.

