కలం, ఖమ్మం బ్యూరో: ఆర్టీసీ కార్మికులు (RTC Workers) తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని, తెగించి పోరాడి హక్కులను సాధించుకుందామని ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ ఔట్ గేట్ నుంచి ఇన్ గేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి బస్టాండు రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా కూనంనేని (MLA Kunamneni) మాట్లాడుతూ.. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని, గత ప్రభుత్వ తప్పిదమే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కార్మిక యూనియన్లంటే పాలకులకు ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. హక్కుల కోసం పోరాడే గొంతులను నొక్కేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని మండిపడ్డారు.
ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, గుర్తింపు సంఘం ఎన్నికలు, వేతన సవరణ, కొత్తబస్సుల కొనుగోలు తదితర డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. చట్టబద్ధంగా సమ్మె చేస్తుంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకుండా రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను తీసుకొస్తోందని ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించి, తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు పెరిగే కొద్దీ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, మిర్యాల రంగయ్య పాల్గొన్నారు.
Read Also: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
Follow Us On: X(Twitter)

