కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ (Warangal) రీజియన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. హనుమకొండ బస్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అర్థరాత్రి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
అయితే, సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, పోలీసులతో కలిసి ప్రైవేట్ బస్సులను నడిపిస్తున్నారు. కానీ బస్సులు అందుబాటులో లేని ప్రాంతంలో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

