కలం, వెబ్ డెస్క్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఈ విషయమై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలికకు సాఫ్ట్ డ్రింక్లో మద్యం కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితురాలు మేజర్ అయ్యాక వివాహం చేసుకుంటానని నమ్మించి, మొత్తం మూడుసార్లు ఆమెను వంచించాడని అన్నారు.
ప్రస్తుతం ఆ నిందితుడు బాలికను మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడిందని ఆయన వెల్లడించారు. ఈ దారుణానికి సంబంధించిన పక్కా ఆధారాలను పోలీసులకు సమర్పించినప్పటికీ, నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాజకీయ పలుకుబడితో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్ఎస్ డిమాండ్ చేశారు.

