కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో (Tirupati Bus Fire ) ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీస్తూ కొందరు ప్రయాణికులు బస్సులో నుంచే కిందకు దూకేశారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు తిరుపతి వైపు వస్తోంది. మార్గమధ్యలోని మేర్లపాక టోల్గేట్ దగ్గరకు చేరుకునేసరికి బస్సు వెనుక భాగం నుంచి భారీగా పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించారు. అప్పటికే బస్సులోని ప్రయాణికులు కూడా పొగను గమనించి ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బస్సు ఎక్కడ పూర్తిగా అంటుకుంటుందోనన్న భయంతో డోర్లు తెరుచుకునే లోపే కొందరు ప్రయాణికులు కిటికీల గుండా, మరికొందరు దిగే ప్రయత్నంలో బస్సులో నుంచి కిందకు దూకేశారు. ఈ తొందరపాటులో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
కాగా, బస్సులో పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన మేర్లపాక టోల్గేట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ సేఫ్టీ పరికరాలతో సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే మంటలను, పొగను అదుపులోకి తీసుకొచ్చారు. టోల్గేట్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం జరిగిందని, లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని ప్రయాణికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

