కలం, వెబ్డెస్క్: జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) మాజీ మంత్రి వైఎస్ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు వైసీపీ హయాంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని బాలినేని అన్నారు. అయితే వైఎస్ జగన్ను ప్రశ్నించినందుకే తన మంత్రి పదవి పోయిందన్నారు. అయినా పార్టీ కోసం కష్టపడ్డట్లు వెల్లడించారు. తాను ప్రశ్నించే పార్టీలో ఉండాలని కోరుకున్నట్లు బాలినేని తెలిపారు. అలాగే జగన్ను కూడా ఎక్కువగా ప్రశ్నించేవాడినని గుర్తు చేశారు. బై ఎలక్షన్లో సైతం తన సొంత డబ్బు ఖర్చు చేసుకున్నట్లు తెలిపారు. అయినా జగన్ ఎప్పుడూ తన గురించి వేదికలపై మాట్లాడలేదని అన్నారు.
ఒంగోల్లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు బాలినేని తెలిపారు. అందులో ఐదు సార్లు గెలిచి, రెండు సార్లు ఓడిపోయినట్లు చెప్పారు. ఆ రెండు సార్లు తనను టీడీపీ ఓడించలేదని, పవన్ కల్యాణ్ ఓడించారని అన్నారు. ఒంగోల్లో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ అని, కాపు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పారు. అయినా తనను ఐదు సార్లు గెలిపించారని అన్నారు. ఇక రెండు సామాజిక వర్గాలు కలవడం కారణంగానే తాను రెండు సార్లు ఓడిపోయినట్లు చెప్పారు.

