కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు (సోమవారం) భూపాలపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును ఆయన పరిశీలించబోతున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి మహదేవపురం మండలంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకోనున్నారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తురపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు చేరుకోనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికగా “రైతు భరోసా” రెండో విడత నిధులను విడుదల చేయబోతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించబోతున్నది. మేడిగడ్డతోపాటూ సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లకు కూడా మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించనున్నారు. మరమ్మతుల కోసం నీటిపారుదల రంగ నిపుణుడైన పరిక్షిత్ మెహ్రా నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు రెండో విడత రైతు భరోసా నిధులు కోసం వేచి చూస్తున్నారు. ఈ నిధులను కూడా సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విడుదల చేయబోతున్నారు.
Read Also: రెండో ‘సారీ’.. ప్రజలకు ప్రధాని మోడీ…
Follow Us On: Instagram

