కలం, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. సీఎం రేవంత్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. గురువారం ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించి.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేక విమర్శలు సైతం గుప్పించారు. అనంతరం సీఎం రేవంత్ (Revanth Reddy) వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. సీఎంకు బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనే విషయం అందరికీ తెలిసిందేన్నారు. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్యుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శించారు. తమను(కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్) అబద్ధాల కోరులని రేవంత్ అనడంపై మండిపడ్డారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంతే అని పేర్కొన్నారు. రేవంత్కు బ్రిజేష్ ట్రిబ్యునల్కు, బచావత్ ట్రిబ్యునల్కు తేడా తెలియదన్నారు.
జురాల మీద భారం పెడితే ఆగమైతం..
‘కేసీఆర్ను, నన్ను ఉరితీయాలని సీఎం రేవంత్ అనాగరికంగా మాట్లాడారు. నల్లమలసాగర్పై నా ప్రశ్నకు సూటిగా ఎందుకు సమాధానం చెప్పలేదు? బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాటం నిజమైతే కమిటీ ఎందుకు వేశారు?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. కమిటీ వేయడమంటే ఏపీ నీటి దోపిడీకి తలుపులు తెరవడమేనని వ్యాఖ్యానించారు. ‘ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 69 శాతం దక్కాలని అప్పుడే డిమాండ్ చేశాం. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని కోరాం. కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్రం హామీ ఇస్తేనే కేసు విత్ డ్రా చేసుకున్నాం.
తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి 450 నుంచి 600 టీఎంసీల వరకు నీళ్లు వస్తాయనే జ్ఞానం కూడా సీఎంకు లేదు. జురాల ప్రాజెక్ట్ కింద 5.50 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలి డే ఎందుకు ప్రకటించారు? శ్రీశైలం మీద ఆధారపడిన కల్వకుర్తికి లోటు లేకుండా నీరు వస్తోంది. జురాల మీద భారం పెడితే ఎవరికీ నీళ్లు రావు. అంతా ఆగమైపోతారు. 90 టీఎంసీలతో పాలమూరుకు డీపీఆర్ పంపాం. ఏడు అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు. కేసీఆర్ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే’ అని సీఎం తీరుపై హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు.
Read Also: తెలంగాణ నదీ జలాలకు బీఆర్ఎస్ మరణశాసనం : ఉత్తమ్
Follow Us On: Youtube


