కలం, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో ఒక శకం ముగిసింది. జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన హెడ్ ఫిజియో ఇవాన్ స్పీచ్లీకి ఫ్రాంచైజీ ఘనంగా వీడ్కోలు పలికింది. 2008లో జట్టు ప్రయాణం మొదలైనప్పటి నుండి 2025 వరకు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు ఆయన జట్టుతోనే ఉన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లు, కోచ్లు పాల్గొని స్పీచ్లీ (Evan Speechly) చేసిన కృషిని కొనియాడారు. ఈ వేడుకలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఆర్సీబీ సెటప్లో తాను అత్యధిక సమయం గడిపింది స్పీచ్లీతోనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన వృత్తి నైపుణ్యం మాత్రమే కాకుండా, చూపించే ప్రేమ, నిజాయితీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. స్పీచ్లీ ఎప్పటికీ ఆర్సీబీ కుటుంబంలో ఒక సభ్యుడిగానే ఉంటారని కోహ్లీ ఎమోషనల్ అయ్యారు.
జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బాబట్ మాట్లాడుతూ.. చాలా కాలం పాటు జట్టుకు వెన్నెముకగా ఉన్న స్పీచ్లీ సేవలను గుర్తించడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆయన చేసిన ప్రతి పనిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడ్కోలు పట్ల ఇవాన్ స్పీచ్లీ స్పందిస్తూ.. హోటల్లో అడుగుపెట్టగానే తనకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా ఆర్సీబీలో (RCB) ఒక్క సీజన్ ఆడాలని కోరుకుంటారని, కానీ తనకు 18 ఏళ్ల పాటు ఇక్కడ ఉండే అవకాశం రావడం అదృష్టమని చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎందరో ఆటగాళ్లకు అండగా నిలిచిన స్పీచ్లీ ప్రయాణం ఆర్సీబీ చరిత్రలో నిలిచిపోనుంది.
Read Also: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ !
Follow Us On : WhatsApp

