కలం, స్పోర్ట్స్ : చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగే కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందని టీమిండియా వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ తమ ప్లేయింగ్ ఎలెవన్లో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్లో ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్లో వరుస విజయాలతో దూసుకుపోయింది. కానీ, గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జోరుకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో ఆయన ఐదు బంతుల్లోనే 17 పరుగులు ఇవ్వడమే కాకుండా, బ్యాటింగ్లోనూ కేవలం ఒక పరుగుకే వెనుదిరిగారు.
ఈ సీజన్లో షెపర్డ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. నాలుగు ఇన్నింగ్స్ల్లో కేవలం 39 పరుగులే చేసిన ఆయన సగటు 19.50గా ఉంది. బౌలింగ్లోనూ 15 పరుగులకు పైగా ఎకానమీతో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశారు. దీంతో ఆయనను జట్టు నుంచి తప్పించి జాకబ్ బెథెల్ లేదా జాకబ్ డఫ్ఫీని తీసుకోవచ్చని అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు. జోష్ హాజిల్వుడ్ మళ్ళీ ఫామ్లోకి రావడం, డఫ్ఫీ ఇప్పటికే ఆరు వికెట్లతో రాణించడం జట్టుకు కలిసొచ్చే అంశమని ఆయన వివరించారు.
చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీకి అంత మంచి రికార్డు లేదు. ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గుజరాత్ గెలిచింది. గతేడాది జరిగిన మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓటమి పాలైంది. ఇక గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ గత రెండు మ్యాచ్ల్లో తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేదని, ఈ మ్యాచ్లో ఆయన ఎలా ఆడతారో చూడాలని అశ్విన్ ఆసక్తి కనబరిచారు.
Read Also: ముత్తోజిపేటలో హైటెన్షన్.. బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు
Follow Us On : WhatsApp

