కలం వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (TSDF) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్డీఎఫ్ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. వినాయక రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం సంస్థగా విలీనం చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు తమ హక్కులు, ఉద్యోగ భద్రత, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, వారి న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమ్మె వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకేనని కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ప్రస్తావించిన డిమాండ్లను వెల్లడించారు. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా విలీనం చేయాలన్నారు. ఒప్పంద, అవుట్ సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు, పెన్షన్ హక్కులు కల్పించాలని సూచించారు. ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రైవేట్ వారికి ఇస్తూ ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసి, కార్మికులకు పని భారాన్ని తగ్గించాలన్నారు. కార్మికులకు కనీస మానవ హక్కులు, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించకుండా, సమ్మెను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని టీఎస్డీఎఫ్ (TSDF) ఆరోపించింది. ఈ తరహా చర్యలను ఖండిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది లక్షలాది ప్రజలకు జీవనాధారమని, ఇలాంటి సంస్థను బలహీనపరచడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆర్టీసీ (TGSRTC) కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని టీఎస్డీఎఫ్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకొచ్చి, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేసింది.
Read Also: ఒక్కడే దిక్కయితే ఎలా?.. చెన్నైకి సెహ్వాగ్ వార్నింగ్!
Follow Us On : WhatsApp

