కలం, వెబ్ డెస్క్ : ఎన్ఎఫ్ఎల్లో వెలుగొందుతున్న యువ ఆటగాడు రషీ రైస్ (Rashee Rice) భవితవ్యంపై ప్రస్తుతం ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర చర్చ సాగుతోంది. కాన్సాస్ సిటీ చీఫ్స్ జట్టులో కీలక పాత్ర పోషిస్తారని భావించిన రైస్, ఇప్పుడు వరుస వివాదాలతో వార్తలలో నిలిచారు. తాజాగా హాల్ ఆఫ్ ఫేమర్ క్రిస్ కార్టర్ (Chris Carter) ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ రషీ రైస్ కెరీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైస్ ఒకవేళ ఫ్రీ ఏజెంట్ అయినా సరే, అతని ఆఫ్-ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ఏ జట్టయినా సైన్ చేసేముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
రషీ రైస్ వివాదాలు 2024లో డల్లాస్ హైవేపై అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ జరిగిన ప్రమాదంతో మొదలయ్యాయి. ఈ కేసులో కోర్టు అతనికి ప్రొబేషన్, జరిమానాతో పాటు 30 రోజుల జైలు శిక్ష విధించింది. అనంతరం ప్రొబేషన్ నిబంధనలు ఉల్లంఘించి డ్రగ్ పరీక్షలలో పాజిటివ్గా తేలడంతో, అతను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల జూన్ 16న ఆయన విడుదలయ్యారు. కోర్టు కేసులకు ముందే గాయాలు కూడా రైస్ కెరీర్ను ప్రభావితం చేశాయి. 2024లో మోకాలి, హామ్స్ట్రింగ్ గాయాలు, 2025లో సస్పెన్షన్, తలకు గాయం కారణంగా అతను కేవలం ఎనిమిది మ్యాచ్లకే పరిమితమయ్యాడు.
జైలుకు వెళ్లే ముందు కూడా మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఈ పరిణామాలన్నింటిని ప్రస్తావిస్తూ క్రిస్ కార్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రషీ రైస్లో ప్రతిభ ఉన్నప్పటికీ, స్థిరత్వం లోపించిందని, నంబర్ వన్ ప్లేయర్గా ఎదగడానికి అవసరమైన క్రమశిక్షణ చూపలేదని అభిప్రాయపడ్డారు. పెద్ద గాయాల తర్వాత అతను తన పాత ఫామ్ను అందుకోలేకపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం రషీ రైస్ తన రూకీ కాంట్రాక్ట్ చివరి ఏడాదిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని భవిష్యత్తు ఎలా మలుపుతీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

