కలం, జనగామ: జనగామ (Jangaon)లోని లోటస్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన మార్ల మౌనిక (25), రమేష్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎ.స్వప్న ఆధ్వర్యంలో మే 21న సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా ఈ అరుదైన ప్రసవం నిర్వహించారు. ప్రసవం అనంతరం తల్లి, ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జన్మించిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని బాల వైద్య నిపుణుడు డాక్టర్ డి.లింగమూర్తి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల నిరంతర సంరక్షణతో తల్లి, శిశువులు క్షేమంగా కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించడం అత్యంత అరుదైన ఘటనగా వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవంతంగా ప్రసవాన్ని నిర్వహించిన డాక్టర్ స్వప్న, డాక్టర్ లింగమూర్తి సహా వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లాలో ఈ అరుదైన ప్రసవం చర్చనీయాంశంగా మారగా, తల్లి, చిన్నారులు ఆరోగ్యంగా ఉండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

