కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు (Jacqueline Fernandez) దిల్లీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్, అతడి భార్య లీనా మరియా పౌల్తో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరో 14 మందిని కూడా అందులో చేర్చాలని స్పష్టంగా పేర్కొంది. అనంతరం విచారణను జూన్ మూడో తేదీకి వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలు ఇవీ..
సుకేశ్ చంద్రశేఖర్ పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి రూ.200 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు సుకేశ్ ఖరీదైన నగలు, విలాసవంతమైన బహుమతులు ఇలా వసూలు చేసిన డబ్బులతోనే ఇచ్చినట్లు గుర్తించింది. ఈ విషయం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే జాక్వెలిన్ వాటిని స్వీకరించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీంతో ఈ కేసులో ఆమెను సైతం చేర్చగా.. తాజాగా అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.

